1931లో తొలిసారి తెలుగు తెరపై మాటలు వినిపించాయి. అంతకు ముందే తెలుగు సినిమా పుట్టినా కేవలం మూకీకే (మాటలు లేకుండా అభినయం) పరిమితమైంది. అలా మూకీగా ఉన్న తెలుగు సినిమా టాకీగా మారి, విభిన్న కథల్ని, నేపథ్యాల్ని పరిచయం చేసింది. ఈ క్రమంలో అనువాద ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. 1950 నుంచి తెలుగులో డబ్బింగ్‌ సినిమాల రాక మొదలైంది. అలా వచ్చిన తొలి అనువాద చిత్రమే ‘ఆహుతి’. బాలీవుడ్‌లో (1946-1-1న విడుదల) విజయం అందుకున్న ‘నీరా ఔర్‌ నందా’ సినిమాకి అనువాదంగా 1950 జూన్‌ 22న విడుదలైంది ఈ చిత్రం. జయసింహ, రూప్ బసంత్, శశి, నిశి బరన్‌ తదితరులు నటించిన ఈ సినిమాకి ఆర్‌.ఎస్‌. జున్నాకర్‌ దర్శకత్వం వహించారు. మాతృకకి పి.శంకర్‌ స్వరాలు సమకూర్చగా తెలుగులో సాలూరి రాజేశ్వరరావు సమకూర్చారు. ఈ సినిమాతోనే మహాకవి శ్రీశ్రీ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాకి మాటలు, పాటలు రాసి తొలి ప్రయత్నంలోనే చిత్రపరిశ్రమని తనవైపునకు తిప్పుకున్నారు. ‘సంఘ సంక్షేమానికి బలైన ప్రేమికుల కథ’ అంటూ తెలుగు వారికి ఈ సినిమాని అందించింది నవీనా ఫిలిమ్స్‌ నిర్మాణ సంస్థ. ఈ వినూత్న ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో అనువాద చిత్రాల జోరు మెల్ల మెల్లగా మొదలైంది. ఈ క్రమంలో ‘ప్రేమలేఖలు’ (1953), ‘రోహిణి’ (1953) తదితర చిత్రాలు బాలీవుడ్‌ నుంచి విచ్చేశాయి. తర్వాతర్వాత తమిళం, మలయాళం, కన్నడ తదితర పరిశ్రమల చిత్రాలూ సందడి చేశాయి. చేస్తూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published.