సెప్టెంబరు 25న భారత్‌ బంద్‌కు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఇచ్చిన పిలుపును సిఐటియు స్వాగతించింది. రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలు మూడింటిని, విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టబద్ధంగా హామీ కల్పించాలని కోరుతూ సాగిస్తున్న పోరాటాన్ని ఉధృతంచేస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు. యావత్‌ కార్మిక లోకం ఈ భారత్‌ బంద్‌లో పాల్గనాలని కోరారు. దేశవ్యాప్తంగా 500కి పైగా రైతు సంఘాల సంయుక్త వేదిక అయిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) జాతీయ సదస్సు రెండు రోజుల పాటు జరిగింది. 22 రాష్ట్రాల నుంచి రెండు వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. పోరాటాన్ని ఉధృతం చేసి, విస్తరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజల జీవితాలు, జీవనోపాధులు, మౌలిక హక్కులు దాడులకు గురవుతున్నాయని సిఐటియు పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మికుల సంఘాలను, విద్యార్థులు, యువత, మహిళలను కలుపుకుంటూ సంయుక్త కిసాన్‌ మోర్చా తీసుకున్న చొరవను అభినందించింది. కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఇతరులకు సంబంధించిన నిర్దిష్ట అంశాలపై సదస్సులో చర్చలు జరిగాయి. వారి సమస్యలపై ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించారు. రైతుల డిమాండ్లను అంగీకరించడానికి నిరాకరిస్తున్న మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని సిఐటియు ఖండించింది. హర్యానాలో రైతులపై బిజెపి ప్రభుత్వం పాల్పడిన అణచివేత చర్యలను, రైతు మృతికి దారి తీసిన పరిస్థితులను ఖండించింది. అన్ని అనుబంధ సంఘాలు, రాష్ట్ర కమిటీలు, పారిశ్రామిక సమాఖ్యలు మొత్తంగా కార్మిక లోకం సెప్టెంబరు 25నాటి భారత్‌ బంద్‌లో పాల్గనాల్సిందిగా సిఐటియు విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published.