కేసీఆర్ సర్కారు మరోసారి ఫీజులు మోత మోగించింది. ఓవైపు కరోనా కారణంగా తగ్గిన ఆదాయం.. మరోవైపు సంక్షేమ భారం.. మళ్లీ కొత్తగా దళిత బంధు వంటి జనాకర్షణ పథకాల ప్రభావం.. మొత్తం మీద భారీగా ఆదాయం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ సర్కారు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందించే వివిధ సేవల ఫీజులు భారీగా పెంచేసింది. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక పెంచిన ఫీజుల వివరాలు పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ రూ. 500గా ఉన్న సొసైటీ రిజిస్ట్రేషన్ ఛార్జీని ఇక ఇప్పుడు ఏకంగా 2 వేల రూపాయలకు పెంచేశారు. అంటే ఏకంగా నాలుగు రెట్లు అన్నమాట. అలాగే సొసైటీల డాక్యుమెంట్ల ఫైలింగ్ ఫీజు కూడా పెంచేశారు.. గతంలో ఇది రూ. 300గా ఉండేది.. ఇప్పుడు అది ఏకంగా వెయ్యి రూపాయలకు పెరిగింది. అంటే మూడు రెట్లకు పైగా పెరిగిందన్నమాట.
అంతకు ముందు ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ రుసుము వెయ్యి రూపాయలుగా ఉండేది.. ఇక దీన్నయితే ఇప్పుడు ఒకేసారి రూ. 10 వేలకు పెంచింది తెలంగాణ సర్కారు. అంటే దాదాపు 10 రెట్లు ఒకేసారి పెంచిందన్నమాట. ఇంకా సర్టిఫైడ్ కాపీ, ఈసీలకు ఇప్పటి వరకూ రూ. 200 చెల్లిస్తే సరిపోయేది. దీన్ని ఇప్పుడు రూ. 500కు పెంచారు. సెలవురోజుల్లో రిజిస్ట్రేషన్కు ఫీజును ఇప్పుడు రూ. 5 వేలుగా నిర్ణయించారు. ఇలా పెరిగిన చార్జీలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రాబోతున్నాయి.
మరి ఒకేసారి ఈ స్థాయిలో ఫీజులు పెంచితే ఎలా అంటారా.. ఆ ఇబ్బందేమీ లేదు. ఇవన్నీ తప్పనిసరిగా చెల్లించాల్సిన ఫీజులే.. ఎంత పెంచినా ఎవరూ ఏమీ అనరన్న దీమా కావచ్చు.. కానీ.. ఇలా అడ్డగోలుగా పెంచితే క్రమంగా అది జనంలో అసంతృప్తికి దారి తీసే అవకాశం ఉంది. మొత్తం జనాభాలో ఇలా రిజిస్ట్రేషన్లు చేయించుకునేవాళ్లు ఎంత మంది.. అయినా అంతంత డబ్బులు పెట్టి భూములు కొంటున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచితే మాత్రం ఆగుతారా అని సర్కారు భావిస్తుండొచ్చు. ఏదైనా పెంపుకు ఓ లెక్క అంటూ ఉండాలి కదా.. అడ్డగోలుగా పెంచుడేనా అన్న అసంతృప్తి కూడా వచ్చే అవకాశం ఉంది.